కొవిడ్ టీకా ధరపై అఖిలపక్ష నేతలతో చర్చించిన ప్రధాని మోదీ

  • పార్లమెంటు విపక్ష నేతలతో వర్చువల్ సమావేశం
  • ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ధర నిర్ణయిస్తామన్న మోదీ
  • పార్టీల సూచనలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని వెల్లడి
మరికొన్ని వారాల్లో భారత్ లో కరోనా టీకా అందుబాటులోకి రానున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభ, రాజ్యసభలోని విపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ వ్యాక్సిన్ ధర ఎలా ఉండాలన్న దానిపై వారితో చర్చించారు. వ్యాక్సిన్ ధర విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతుందని, ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కొవిడ్ టీకా ధర నిర్ణయిస్తామని మోదీ వెల్లడించారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ బృందాలు కూడా వ్యాక్సిన్ పంపిణీపై ప్రణాళికలు రూపొందిస్తున్నాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో, కరోనాపై అన్ని రాజకీయ పక్షాలు తమ సలహాలు, సూచనలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. పార్టీల నుంచి వచ్చే సూచనలు, సలహాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. అత్యంత చవకగా, భద్రమైన టీకా భారత్ నుంచి వస్తుందని తక్కిన ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.

Narendra Modi
Vaccine
Price
Corona Virus
India

More Telugu News